mahimasabdam.tv@gmail.com
+91 9390209376
పునరుత్థాన సిద్ధాంతమే కొత్త నిబంధనకు పునాది. కొత్త నిబంధనలో పునరుత్థానాన్ని గురించి 104 సార్లు రాసి ఉంది.
మతాల ప్రారంభకులందరిలో ఒక్క క్రైస్తవ మత ప్రారంభకుడు మాత్రమే జీవించి ఉన్నాడు. క్రైస్తవ అతిశయం, దాని ఘనత ఖాళీ సమాదే. క్రీస్తు యేసు సజీవునిగా లేచాడు.
'సమాప్తమైనది' అని యేసు సిలువ మీద కేక వేశాడు. అందుకు దేవుడు 'ఆమేన్' అన్నాడు. పునరుత్థానం వలన కుమారుడు మృతులలో నుండి సజీవునిగా లేచాడు. యేసు సమాధిలో నుండి లేవకుండా వున్నట్లయితే, మానవులమైన మనమంతా మన పాపంలోనే ఉండి నశించిపోయిన వారిగా, శాశ్వతంగా తప్పిపోయి దయనీయమైన స్థితిలో ఉండి ఉండే వాళ్ళం. 1 కొరింథీ 15:16-19. తాను చనిపోయి మూడవ రోజున మృతులలో నుండి లేస్తానని యేసు ముందుగానే చెప్పాడు. మత్తయి 16:21.
పునరుత్థానమేగాని నిజమైనదైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడే. పునరుత్థానం నిజమా కాదా అన్నదాని మీదనే మిగతా అద్భుతాలు ఆధారపడతాయి. అద్భుత కార్యాలన్నిటిలోకీ గొప్పదైన ఈ అద్భుతం గనుక నిజమైనదైతే మిగతా వాటినన్నిటినీ నమ్మడం సులభమే.
|. పునరుత్థానికి రుజువు Evidence of the Resurrection
1. ఖాళీ సమాధి : మత్తయి 28:6, 'ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూడుడి'.
లూకా 24:3, 'సమాధియందు ఉంచిన రాయి దొరలింపబడియుండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు'.
2. దేవదూతల సాక్ష్యం : మత్తయి 28:5-6; లూకా 24:5-7 'సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి యున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండినప్పుడు, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడి'.
3. పునరుత్థానం తర్వాత ఆయనతో మాట్లాడినవారు పేతురు, మరియ, క్లోప, తోమా.
4. పునరుత్థానం తర్వాత యేసు ఆహార పానీయాలు తీసుకొన్నాడు. ఆయన తన స్నేహితులకు తన గాయాలు చూపించాడు.
5. ఒకేసారి ఆయనను 500 మంది చూశారు. 1కొరింథీ 15:6, 'అయిదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందె కనబడెను'.
6. సైఫను చనిపోయేటప్పుడు అతనికి ఆయన ప్రత్యక్షమైనాడు.
అపొ.కా.7:56, 'ఆకాశము తెరువబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచెను'.
7. దమస్కు మార్గంలో పౌలుకు ప్రత్యక్షమైనాడు. అపొ.కా.9:5 'ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన - నేను నీవు హింసించుచున్న యేసును.....' అన్నాడు.
8. ఆయన సజీవుడైవున్న రక్షకుడనే లక్షలాదిమంది సాక్ష్యం ఆయన పునరుత్థానాన్ని నిరూపిస్తోంది.
9. ఇంకా అనేకమైన పొరబాటులేని రుజువులున్నాయి. అపొ.కా.1:3.
||. యేసు పునరుత్థానాన్ని గూర్చిన వివరణలుExplanations of Jesus Resurrection
1. కపట సిద్ధాంతం : ఈ కధంతా హాస్యాస్పదమైంది. ఉద్దేశపూర్వకమైన వంచనతో కూడినదని ఒక వాదం. ఇలాంటి హాస్యాస్పదమైన సిద్ధాంతాలను చరిత్ర, లేఖనం ఖండిస్తోంది.
2. మూర్ఛ సిద్దాంతం - యేసు మూర్ఛపోయాడే గాని సైనికులు ఆయనను చంపలేదు. తర్వాత చల్లని సమాధి, సుగంధ ద్రవ్యాలు ఆయన మూర్ఛనుండి తేరుకొనేలా చేశాయి. ఆయనకు మళ్ళీ ప్రాణం వచ్చింది అనేది మరొక వాదం. కానీ వాస్తవమేమిటంటే సుగంధ ద్రవ్యాలు విషపూరితమైనవి. ఎవరినైనా బ్రతికించడానికి బదులు చంపుతాయి.
3. భ్రమ సిద్ధాంతం - శిష్యులు యేసును చూడాలనుకొన్నారు. ఆయన లేచాడనుకొన్నారు. ఆయన్ను చూశామని ఊహించుకొన్నారు. అందుకే ఆయన లేచినట్టు భ్రమపడ్డారు అనేది మరొక వాదం. శిష్యులు అపనమ్మకంలో మునిగిపోయి ఉన్నారు. ఆయనను చూసినా ఆయన వచ్చాడని నమ్మలేకపోయారని లేఖనం చెబుతోంది. తోమా అయితే ఆయనను తాకిగాని నమ్మలేకపోయాడు. శిష్యులకు విశ్వాసం లేక నమ్మలేకపోయారు. అందకు యేసు వారిని గద్దించాడు, లూకా 24:25
4. భూత సిద్ధాంతం - శిష్యులు యేసును చూసి అది భూతమని అనుకొన్నారు. గనుక ఆయన శరీరంతో లేవలేదు అనేది మరొక వాదం. భూతానికి మాంసం గానీ, ఎముకలు గానీ వుండవు. అది తినదు, తాగదు, లూకా 24:39,43.
5. పురాణ సిద్ధాంతం - ఇది ఏ సత్యంలేని పారంపర్యంగా అందించిన ఒక క్రమంలేని పుక్కిటి పురాణం అని కొందరు అంటారు. ఈ సిద్దాంతం అసత్యమని లేఖన ప్రామాణికత చెబుతోంది.
6. నిజమైన వివరణ - తాను మృతులలో నుండి లేస్తానని యేసు ముందుగా చెప్పినట్టే ఆయన శరీరంగా సమాధి నుండి లేచాడు. అపొ.కా. 2:24 'మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను'.
|||. ఆయన పునరుత్థాన శరీరం His Resurrection Body
1. ఆయన శరీరానికి మాంసం, ఎముకలున్నాయి : లూకా 24:39, 'నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమునకుండవని చెప్పెను'.
2. అది మహిమ శరీరం : ఫిలిప్పీ 3:21, 'సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును'.
3. అది శాశ్వతమైన శరీరం, అంటే ఎన్నటికి చనిపోనిది : రోమా 6:9, 'మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరుగుదుము'.
4. అది ఆత్మ సంబంధమైన శరీరం : 1కొరింథీ 15:44, 'ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడా ఉన్నది'.
5. ఆత్మ సంబంధమైన శరీరానికి గోడవంటి వాటినుండి కూడా అవతలికి దాటివెళ్ళగల సమర్ధత వుంటుంది, యోహాను 20:19, 'ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు శుభము కలుగును గాక అని వారితో చెప్పెను'.
|V. యేసు మృతులలో నుండి ఎలా లేచాడు?How did Jesus Rise From the Dead?
1. తండ్రి శక్తితో : అపొ.కా.2:23,24 'మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించియుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను'. అపొ.కా.3:15; 5:30 కూడా చూడండి.
2. క్రీస్తుకు ఉన్న స్వయం శక్తితో : యోహాను 2:19, 'యేసు - ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను'.
3. పరిశుద్ధాత్మ శక్తితో : 1 పేతురు 3:18, 'నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు, ఆత్మ విషయములో బ్రతికింపబడెను'.
V. పునరుత్థాన ఫలితాలు Results of the Resurrection
1. ఇది దేవుని ఉనికిని ఋజువు పరుస్తుంది. దేవుడు లేకపోతే యేసుక్రీస్తు ఎలా పునరుత్థానుడు కాగలడు? సజీవుడైన దేవుడు యేసును లేపాడు గనుక ఆయన పునరుత్థానుడు కాగలిగాడు.
2. అది క్రీస్తు దైవత్వాన్ని నిరూపిస్తోంది. రోమా 1:4, 'మృతులలో నుండి పునరుత్థానుడై నందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను'.
3. తాను సాధించిన రక్షణ కార్యం పూర్తి అయినదని, దానిని తన పునరుత్థానం స్థిరపరుస్తున్నదని యేసు చెప్పాడు.
4. ప్రతి ఒక్కరూ మృతులలో నుండి లేస్తారని యేసు పునరుత్థానం హామీ ఇస్తున్నది.
1) నీతిమంతులు నిత్యజీవమునకు
2) ఆ నీతిమంతులు ఉగ్రుడైన న్యాయాధిపతిని ఎదుర్కొని, శాశ్వత శిక్షను పొందడానికి లేస్తారు.
5. అది 'నేను మళ్ళీ వస్తాను' అన్న ఆయన తర్వాతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయనను సమర్ధుణ్ణి చేసింది.
6. 'ఆయన పునరుత్థాన శక్తి' (ఫిలిప్పీ 3:10) ఇప్పుడు మనం అనుభవించే ఒక ప్రభావం. దీని అర్ధం - పునరుత్థానుడైన క్రీస్తు మన శరీరాల ద్వారా జీవిస్తున్న నూతన జీవితం అని అర్ధం.
ముగింపు
ప్రార్ధనాశక్తి, తరువాత ప్రపంచంలో పునరుత్థానం అన్నది సాటిలేని (మహా) శక్తి.
ఆటం (పరమాణువు శక్తి), హైడ్రోజన్, మణిశిల, యురేనియమ్ (అణు రియాక్టర్లలో వాడే ప్రతిఘాత పదార్ధం) శక్తులన్నిటినీ పునరుత్థాన శక్తి మించిపోతుంది. ఈ ఆయుధాలకు నాశనం చేసే శక్తి ఉంటే పునరుత్థానానికి చనిపోయినవారికి జీవం ఇచ్చే శక్తి ఉంది.
ఈ పునరుత్థాన మహాశక్తి నా శరీరంలో ప్రవహించి పాపం చేయనివ్వకుండా నన్ను దూరపరచును గాక.
క్రైస్తవ్యం నిలవడానికి, లేక పడిపోడానికి పునరుత్థానం ఆధారం. పునరుత్థానం కదిలించలేని బండవంటిది. ఇది అవిశ్వాసానికి, నాస్తిక సిద్ధాంతానికి, భౌతికవాదానికి పూర్తి ఓటమిని కలిగిస్తుంది.
ఎందుకంటే క్రీస్తు మృతులలో నుండి లేచాడు. కనుక భౌతికవాదం, కమ్యూనిజం, నాస్తికత్వం ఓడిపోతాయి.
నేడు మరణం మహా విజేత. అది దేశమంతా అంగలువేస్తూ గుంటలు తవ్వుతూ, చచ్చిన వారితో వాటిని నింపుతోంది. అయితే పునరుత్థానం సమాధిశక్తిని భంగపరిచే మహాశక్తి.
అందుకని 1కొరింథీ 15:55, 'ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?' అని సవాలు చేస్తోంది. నేడు మనం విజేతలమని చెప్పగలం.
మృతులలో నుండి లేచిన రక్షకుని మనం సేవిస్తున్నాం. నేడు ఆయన లోకంలో ఉన్నాడు. సంఘానికి శిరస్సై ఆయన మనకు నాయకుడుగా ఉండగా విజేత అయిన క్రీస్తును అనుసరించి ముందుకు నడిచే మనదే విజయం.
యేసు సజీవుడని ఇతరులు తెలుసుకొనేలా ఆయన జీవితాన్ని మనం జీవించాలి. - ఆల్బన్ డగ్లస్
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.










Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech