14 August 2026
నాయకుడు మోసిన తువాలు
ఒక పట్టణంలోని చిన్న సంఘానికి కొత్తగా పాస్టర్గా దానియేలు నియమించబడ్డాడు.
ఆయన బైబిలు బోధలోనే కాదు, సేవలో కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకున్నాడు.
కొంతకాలానికి సంఘంలో కొత్త నాయకులను నియమించే రోజు వచ్చింది.
అందరూ పాస్టర్ గారు వారికి గొప్ప ప్రసంగం చేస్తారని ఎదురుచూశారు.
కానీ దానియేలు పాస్టర్ నిశ్శబ్దంగా ఒక తువాలు, ఒక పాత్రలో నీళ్లు తీసుకొని వేదిక ముందు ఉంచాడు.
తర్వాత కొత్త నాయకులందరినీ ముందుకు రమ్మని ఆహ్వానించాడు.
సంఘ సభ్యులందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా, పాస్టర్ ఒక్కొక్కరి పాదాలను ప్రేమతో కడిగి తువాలతో తుడిచాడు.
అనంతరం ఆయన ఆ నాయకులను కూడా ఒకరి పాదాలను మరొకరు కడగమని కోరాడు.
ఆ దృశ్యాన్ని చూసిన వారిలో రాజేష్ అనే యువకుడు ఎంతో కదిలిపోయాడు.
అతడు నాయకత్వం అంటే ఆజ్ఞలు ఇవ్వడం, గౌరవం పొందడం అని అనుకునేవాడు.
కానీ ఆ రోజు యేసు క్రీస్తు తన శిష్యుల పాదాలు కడిగిన సంఘటనను గుర్తు చేస్తూ పాస్టర్ చెప్పిన మాటలు అతని హృదయాన్ని మార్చేశాయి.
*పాస్టర్ గారి ప్రసంగం *:-
“యోహాను సువార్త 13వ అధ్యాయంలో వ్రాయబడినట్టు వారు ఆ రోజున చేసింది, మనకొరకు యేసు క్రీస్తు ఒక మాదిరిగా చేసి చూపించారు.
ప్రభురాత్రి భోజనంగా పిలువబడిన ఆ సంఘటనలో, యేసు క్రీస్తు “భోజనపంక్తిలోనుండి లేచి ...
పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను”
— యోహాను 13:4-5 , అని వ్రాయబడియున్నది.
ఆ తరువాత తానెందుకు అలా చేశాడో యేసు తన శిష్యులకు వివరిస్తూ “ దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని“(యోహాను 13:16)...
“నేను మీ మధ్య పరిచర్య చేయు వానివలె ఉన్నాను”. - లూకా 22:27 అని అన్నారు.
దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు, శిష్యుల పాదాలు కడగడమంత తక్కువ పని చెయ్యటం ఆయన ప్రతిష్టకు తక్కువైనది కాకపొతే, మనం ఇతరులకు సేవ చెయ్యటంలో తక్కువ పని కాదు అని గ్రహించాలి.
వాస్తవంగా, మనందరి యెదుట ఎంత అద్భుతమైన మాదిరిని ఉంచాడాయన.
నిజముగా ఆయన, “...
పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు...” (మార్కు 10:45) వచ్చాడు.
ఒకనాయకుడిగా మరియు ఒక దాసునిగా ఉండడం అంటే ఏమిటో మాదిరిగా చూపించాడాయన.
ఎవరైతే ఇట్టి మాదిరిని అనుసరిస్తారో వారే ఆయన సేవకులు.
ఒక్క విషయం జ్ఞాపకముంచుకుందాం “క్రీస్తు కొరకు చేసిన ఏపనైనా అది చిన్నది కాదు”.
ఆమెన్.
"
కొన్ని రోజుల తర్వాత సంఘ ఆవరణలో వర్షం కారణంగా చెట్లు విరిగి, ప్రాంగణం మురికిగా మారింది.
అందరూ ఎవరో వచ్చి శుభ్రం చేస్తారని ఎదురుచూస్తుండగా, రాజేష్ నిశ్శబ్దంగా చీపురు, పార తీసుకొని శుభ్రం చేయడం ప్రారంభించాడు.
అతనిని చూసి ఇతర నాయకులు, యువకులు, పెద్దలు కూడా చేరి కలిసి పని చేశారు.
కొద్దిసేపట్లో మొత్తం ప్రాంగణం శుభ్రంగా మారిపోయింది.
ఆ సాయంత్రం పాస్టర్ చిరునవ్వుతో రాజేష్ను చూసి, “ఈరోజు నువ్వు నిజమైన నాయకుడిగా నిలిచావు.
సేవ చేయడానికి వంగినవాడే దేవుని దృష్టిలో గొప్పవాడు” అని అన్నాడు.
ఆ రోజు నుండి ఆ సంఘంలో నాయకత్వం అంటే అధికారం కాదు, సేవ అనే భావన బలపడింది.
ప్రతి ఒక్కరూ చిన్న పని, పెద్ద పని అనే తేడా లేకుండా దేవుని కొరకు ఆనందంగా సేవ చేయడం ప్రారంభించారు.
యేసు చూపించిన దాసత్వ నాయకత్వమే వారి జీవితాలకు మార్గదర్శకమైంది.